కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీచైతన్య శారదా భవన్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మొల్లి పవన్‌కుమార్‌ (17) మృతి ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు, పెనమలూరు సీఐ జె. వెంకట రమణ ఈ వివరాలను మంగ‌ళ‌వారం వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. తోటి విద్యార్థి హేమంత్‌తో ఏర్పడిన వివాదం నేపథ్యంలో జనవరి 5, 30 తేదీల్లో పవన్‌కుమార్‌పై ఆరుగురు విద్యార్థులు దాడి చేశారు. ఆ దాడి దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో పవన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరకు జనవరి 31న హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంఘటన అనంతరం కాలేజీ ప్రిన్సిపల్‌తో పాటు సిబ్బంది సాక్ష్యాలను చెరిపివేసి ఘటనను దాచేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పవన్ ఆత్మహత్యకు కారణమైన ఆరుగురు విద్యార్థులు, సాక్ష్యాలు తారుమారు చేసిన ఆరుగురు సిబ్బందిని అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా, పవన్‌కుమార్‌ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని, మృతుని కుటుంబానికి శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, బంగారుమెట్ట గ్రామస్తులు అనకాపల్లిలోని శ్రీచైతన్య కాలేజీ వద్ద ఇటీవల ధర్నా నిర్వహించారు.

సీనియర్‌ విద్యార్థులు పవన్‌ను దారుణంగా కొట్టి చంపారని, ఈ ఘటనను కాలేజీ యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ మృతుని కుటుంబాన్ని తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆరోపించారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *