ములుగు జిల్లా పత్తిపల్లి ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత అధ్యక్షత వహించారు.
డీఎన్ఆర్ ట్రస్ట్ అధినేత ప్రతాపరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిరంతరం కృషి చేయాలని సూచించారు. లక్ష్యసాధనలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు డీఎన్ఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని తెలిపారు. విద్యోదయం ఎంతో ముఖ్యమని, ములుగు జిల్లా జ్ఞానోదయానికి ప్రతీకగా నిలవాలని కోరారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులతో మాట్లాడుతూ బడిని గుడిలా చూసుకోవాలని, బడి బాగుంటే ఊరు బాగుంటుందని వివరించారు. పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు కృషి చేయాలని, ఉన్నత విద్యను ప్రోత్సహించడం ద్వారా నిజమైన ఆస్థి వారికే దక్కుతుందని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ, ఉపాధ్యాయుల సహకారం విశేషమని, భవిష్యత్తులో కూడా వారి సహకారం కొనసాగాలని ప్రధానోపాధ్యాయురాలు ఆకాంక్షించారు.