▪️ ప్రపంచ చరిత్రదినోత్సవం సందర్భంగా సంచలన పరిశోధనా ప్రజెంటేషన్
▪️ “ప్రపంచ మహా జలప్రళయ నాగరికత – మత్స్యావతార నాగరికత”పై కొత్త సిద్ధాంతం ఆవిష్కరణ
▪️ సింధు లోయ నాగరికతపై వినూత్న దృక్కోణం ప్రతిపాదించిన ఇట్స్ సిక్స్‌త్ వావ్ (ITS 6TH WOW) సంస్థ‌

హైదరాబాద్: మానవ నాగరికత చరిత్రలో వేల ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న మహా జలప్రళయ కథనాల వెనుక ఏదైనా ఉమ్మడి చారిత్రక జ్ఞాపకం దాగి ఉందా? వేదాలలోని మనువు, బైబిల్‌లోని నోవా, ఖురాన్‌లోని నూహ్, మెసొపొటేమియాలోని ఉత్నపిష్టిమ్, జియుసుద్ర, గ్రీకు సంప్రదాయంలోని డ్యూకలియన్ వంటి మహా జలప్రళయ గాథలు ఒకే ప్రాచీన నాగరికతను సూచిస్తున్నాయా? సింధు లోయ నాగరికతలో కనిపించే చేప చిహ్నాలు, జల నిర్వహణ వ్యవస్థలు, సముద్ర వాణిజ్య ఆనవాళ్లు ఈ ప్రశ్నలకు కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది ఇట్స్ సిక్స్‌త్ వావ్ (ITS 6TH WOW) సంస్థ‌. ప్రపంచ చరిత్ర దినోత్సవం–2026 సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ITS 6TH WOW సంస్థ, జై మత్స్యావతార క్యాంపెయిన్ ఆధ్వర్యంలో “ప్రపంచ మహా జలప్రళయ నాగరికత – మత్స్యావతార నాగరికత” అనే వినూత్న పరిశోధనా చట్రాన్ని ఆవిష్కరించింది. ఈ పరిశోధనను ITS 6TH WOW ప్రధాన కార్యదర్శి రవీంద్రజిత్ రూపొందించారు.

ప్రపంచంలోని మహా జలప్రళయ సంప్రదాయాలు, సింధు లోయ నాగరికత, పురావస్తు ఆధారాలు, ప్రాచీన సాహిత్యం, భౌగోళిక మార్పులు, సాంస్కృతిక జ్ఞాపకాల మధ్య ఉండవచ్చని భావిస్తున్న సంబంధాలను అంతరశాఖాపరమైన పరిశోధన ద్వారా అధ్యయనం చేయడానికి ఈ చట్రం ప్రతిపాదించబడింది.

సంస్థ ప్రతినిధులు స్పష్టం చేస్తూ, ఇది చారిత్రకంగా నిరూపితమైన సిద్ధాంతం కాదని, భవిష్యత్ శాస్త్రీయ పరిశోధనలకు మార్గదర్శకంగా రూపొందించిన ఒక పరిశోధనా ప్రతిపాదన (Research Hypothesis) మాత్రమేనని పేర్కొన్నారు.

ఈ పరిశోధన ప్రకారం ప్రపంచంలోని అనేక నాగరికతల్లో కనిపించే జలప్రళయ కథనాలు కేవలం పురాణ గాథలుగా కాకుండా, ఒకే మూల సాంస్కృతిక జ్ఞాపకానికి ప్రతిరూపాలై ఉండవచ్చనే అవకాశాన్ని పరిశీలించాలని సూచిస్తోంది.

దైవ హెచ్చరిక, జీవరాశుల సంరక్షణ, మహా నౌక నిర్మాణం, ప్రళయం నుంచి రక్షణ, కొత్త భూమిపై నాగరికత పునర్నిర్మాణం, యజ్ఞాలు, కృతజ్ఞతా సంప్రదాయాలు వంటి అంశాలు ప్రపంచంలోని అనేక నాగరికతల్లో కనిపించడం పరిశోధకుల దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశాలుగా ప్రజెంటేషన్‌లో వివరించారు.

ఏడు మూల స్తంభాలతో పరిశోధన చట్రం
ప్రతిపాదిత ప్రపంచ మహా జలప్రళయ నాగరికతను అధ్యయనం చేయడానికి ఏడు ప్రధాన పరిశోధనా అంశాలను ఈ ప్రజెంటేషన్ సూచించింది.

ఎంపిక చేయబడిన రక్షకుడు, రక్షకుని నగరం, ఆర్క్ నగరం, సప్త ఋషులు, సప్త ఋషుల నగరాలు, మహా ప్రళయం అనంతరం దిగిన ప్రదేశం, యజ్ఞం మరియు కృతజ్ఞతా సంప్రదాయం వంటి అంశాలను ప్రపంచవ్యాప్తంగా కనిపించే జలప్రళయ గాథలతో అధ్యయనం చేయాలని ప్రతిపాదించింది.

ధోలవీరా… ప్రపంచ జలప్రళయ నాగరికత కేంద్రామా?
ఈ పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన ప్రతిపాదనల్లో ఒకటి గుజరాత్‌లోని ధోలవీరా.

అత్యాధునిక నీటి నిర్వహణ వ్యవస్థలు, అద్భుత పట్టణ ప్రణాళిక, వ్యూహాత్మక భౌగోళిక స్థానం దృష్ట్యా ధోలవీరాను ప్రతిపాదిత ప్రపంచ మహా జలప్రళయ నాగరికతలో పరిపాలనా, జ్ఞాన పరిరక్షణ కేంద్రంగా మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని పరిశోధన ప్రస్తావించింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన డాక్‌యార్డులలో ఒకటిగా గుర్తింపు పొందిన లోథల్ గురించి కూడా ప్రజెంటేషన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ప్రాచీన సముద్రయాన సాంకేతికత, మహా నౌకల నిర్మాణం, జలప్రళయానంతర సంరక్షణ యాత్రలతో లోథల్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే అంశాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలని పరిశోధన సూచించింది.

సింధు లోయ నాగరికతలోని ముద్రలు, పాత్రలు, పురావస్తువులపై తరచూ కనిపించే చేప చిహ్నం ఈ ప్రజెంటేషన్‌లో ప్రధాన చర్చాంశంగా నిలిచింది.

మత్స్యావతార సంప్రదాయంలో చెప్పబడినట్లుగా మానవాళిని మహా జలప్రళయం గురించి హెచ్చరించి జీవరాశులను రక్షించిన కథనానికి సంబంధించిన సాంస్కృతిక జ్ఞాపకంగా ఈ చేప చిహ్నం ఉండి ఉండవచ్చనే కొత్త దృక్కోణాన్ని పరిశోధన ప్రతిపాదించింది.

ఈ నేపథ్యంలో భవిష్యత్ విద్యా పరిశోధనల కోసం “మత్స్యావతార నాగరికత” అనే భావనాత్మక పరిశోధనా చట్రాన్ని పరిచయం చేసింది.

వేదాలు, మెసొపొటేమియా, బైబిల్, ఇస్లామిక్, పర్షియన్, గ్రీకు సంప్రదాయాల్లోని మహా జలప్రళయ కథనాలను విపులంగా విశ్లేషించిన ఈ పరిశోధనలో దైవ హెచ్చరిక, పవిత్ర నౌక, జీవరాశుల సంరక్షణ, ప్రళయం అనంతర పునర్నిర్మాణం, యజ్ఞాలు, కృతజ్ఞతా సంప్రదాయాలు వంటి అంశాలు అన్ని సంప్రదాయాల్లో కనిపిస్తున్నాయని వివరించారు.

“మత్స్యావతార నాగరికత” భావనను అంతిమ చారిత్రక సత్యంగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, శిలాశాసన నిపుణులు, సముద్ర పురావస్తు పరిశోధకులు, భూగర్భ శాస్త్రవేత్తలు, పూర్వ వాతావరణ శాస్త్రవేత్తలు, సంస్కృత పండితులు, కృత్రిమ మేధస్సు పరిశోధకులు ఆధారాలతో పరిశీలించాల్సిన పరిశోధనా చట్రంగా ITS 6TH WOW అభివర్ణించింది.

ఈ సందర్భంగా ITS 6TH WOW ప్రధాన కార్యదర్శి రవీంద్రజిత్ మాట్లాడుతూ, “మత్స్యావతార నాగరికత పరిశోధనా చట్రం ద్వారా పురావస్తు శాస్త్రం, ప్రాచీన సాహిత్యం, సాంస్కృతిక జ్ఞాపకాలు, ప్రపంచ జలప్రళయ సంప్రదాయాల మధ్య ఒక కొత్త శాస్త్రీయ సంభాషణను ప్రారంభించాలనేది మా లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఈ అంశాన్ని ఆధారాలతో పరిశీలించి మానవ నాగరికత చరిత్రలోని ఒక ఆసక్తికరమైన అధ్యాయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌సీ కౌన్సిల్ తెలంగాణ చైర్మన్ విజయ్, డా. చింతా రుక్మాంగదరావు, శ్రీశ్రీ సురేష్ ఆత్మారాం గురూజీ, ITS 6TH WOW అంతర్జాతీయ చైర్మన్ కిషోర్ కుమార్ పుల్లా, ఇండియా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కొండకిండి, తెలంగాణ చైర్మన్ కళాధర్ వల్లం, అధ్యక్షురాలు జాహ్నవి సాహితి, ఉపాధ్యక్షుడు క్రాంతి కుమార్, జై మత్స్యావతార క్యాంపెయిన్ సభ్యులు మనీష్, అంకన్న తదితరులు పాల్గొన్నారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *