▪️ పాఠ‌శాల సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న TDF USA అధ్యక్షులు

▪ శ్రీ సరస్వతీ శిశు మందిర్ సంక్రాంతి వేడుక‌ల్లో టీడీఎఫ్ బృందం

▪️ పాల్గొన్న అధ్య‌క్షుడు దివేశ్ అనిరెడ్డి, టీడీఎఫ్ పూర్వ అధ్య‌క్షురాలు క‌విత చ‌ల్లా

▪️ కుషాయిగూడ పాఠ‌శాల పునరుద్ధరణ కోసం టీడీఎఫ్ భారీ ఆర్థిక సాయం

▪️ రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్థిక సాయం చేసిన క‌విత చ‌ల్లా, దివేశ్ అనిరెడ్డి

హైద‌రాబాద్: తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం (TDF) మ‌రోసారి దాతృత్వం చాటుకుంది. కుషాయిగూడ పాఠ‌శాల పునరుద్ధరణకు టీడీఎఫ్ – యూఎస్ఏ భారీ ఆర్థిక సాయం అందించింది. టీడీఎఫ్ పూర్వ అధ్య‌క్షురాలు క‌విత చ‌ల్లా, టీడీఎఫ్ అధ్య‌క్షుడు దివేశ్ అనిరెడ్డి ఈ పాఠ‌శాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 10 ల‌క్ష‌ల రూపాయ‌లు అందించి మాన‌వ‌త్వం చాటుకున్నారు.

కుషాయిగూడలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠ‌శాల పునరుద్ధరణ కోసం గ‌తంలో ఏ ఎస్ రావు నగర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ పావని అభ్యర్థనలను టీడీఎఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మట్టా దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమయంలో TDF USA ప్రెసిడెంట్‌గా ఉన్న‌ కవితా చల్లా పాఠశాలను సందర్శించారు. పాఠ‌శాల పునరుద్ధరణ కోసం త‌మ స‌హ‌కారం ఉంటుంద‌ని ప్ర‌క‌టించి, టీడీఎఫ్-యూఎస్ఏ నుంచి 5000 డాల‌ర్ల ఆర్థిక సాయం అందించారు.

తాజాగా మ‌ళ్లీ టీడీఎఫ్ USA అధ్య‌క్షుడు దివేశ్ అనిరెడ్డి పాఠ‌శాల‌ను సంద‌ర్శించి అద‌నంగా మ‌రో 5000 డాల‌ర్లు ఆర్థిక సాయంగా అందించారు. దీంతో సరస్వతి శిశు మందిర్ పాఠశాల పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం TDF -USA పూర్వ‌, ప్ర‌స్తుత ప్రెసిడెంట్‌లు కవిత చల్ల, దివేష్ అనిరెడ్డి ఆధ్వ‌ర్యంలో మొత్తంగా 10 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఆర్థిక సాయంగా అందించిన‌ట్టయింది.

 

పాఠ‌శాల పునరుద్ధరణ పూర్త‌యిన సంద‌ర్భంగా పాఠ‌శాల నిర్వ‌హ‌కులు దివేష్ అనిరెడ్డిని, కవితా చల్లాను ఆహ్వానించి స‌న్మానించారు. పాఠశాల అభ్యున్నతికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు తమ కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందడంతో పాటు మరిన్ని అడ్మిషన్లు పెరిగాయని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

పాఠశాల అభివృద్ధిలో భాగంగా TDF USA ద్వారా ‘TDF మన తెలంగాణ బడి’ ప్రాజెక్టులో భాగంగా పాఠశాల భవనం ఆధునీకరించ‌డానికి కృషి చేసిన పావని రెడ్డిని, కవిత చల్లాని, దివేశ్ అనిరెడ్డిని, మట్ట రాజేశ్వర్ రెడ్డిని పాఠశాల కమిటీ సభ్యులు బాలకృష్ణ, లక్ష్మీ, ప్రధానాచార్యులు రాధిక సన్మానించారు.

బాలికలకు అదనపు స్నానపు గదులు కావాలని పాఠశాల సిబ్బంది కవిత చల్లాను అభ్యర్థించారు. వాటి ఖర్చుల‌కు తాము స‌హ‌క‌రిస్తామ‌ని కవిత చల్లా హెడ్ మాస్టర్ కు హామీ ఇచ్చారు. బాలికల‌కు విద్య‌తో పాటు వారి వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలు కూడా ముఖ్య‌మ‌న్నారు. పాఠ‌శాల‌కు, విద్యార్థులకు మ‌రిన్ని అవ‌స‌రాల‌ను రాబోయే రోజుల్లో పరిశీలిస్తామని కవిత చల్లా చెప్పారు. గ‌తం కంటే పాఠ‌శాల మౌళిక స‌దుపాయాలు, విద్య మ‌రింతా నాణ్యంగా పెర‌గ‌డంతో కవితా చల్లా, దివేష్ అనిరెడ్డి ఫలితాల‌ను చూసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నారులు త‌మ‌ కెరీర్‌పై దృష్టి పెట్టాలని, పాఠశాలను మెరిట్‌లో టాప్ లిస్టింగ్‌లో ఉండేలా ప్ర‌య‌త్నించాల‌ని వారిని ఈ సంద‌ర్భంగా ప్రోత్సహించారు.

ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల‌లో టీడీఎఫ్ బృందంతో క‌లిసి సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. కవితా చల్లా, దివేష్ అనిరెడ్డితో పాటు పి. పావని మహిపాల్ రెడ్డి, మట్ట రాజేశ్వర్ రెడ్డి త‌దిత‌రుల‌తో క‌లిసి పాఠ‌శాల యాజ‌మాన్యం భోగి, సంక్రాంతి పండ‌గ వేడుక‌ను నిర్వ‌హించారు. సంక్రాంతి ముగ్గుల‌తో పాటు గాలిప‌టాలు, ప‌లు రకాల అలంక‌ర‌ణ‌లు చేశారు. ఈ వేడుక‌ల్లో ప్ర‌తిభ చూపించిన విద్యార్థుల‌కు కవితా చల్లా, దివేష్ అనిరెడ్డి బ‌హుమ‌తులు అందించారు. త‌మ‌తో క‌లిసి పండ‌గ సంబ‌రాల్లో పాల్గొన్న‌ పిల్లలంద‌రికి ధన్యవాదాలు తెలిపారు.

 

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *